జీవితం ఒక్కటే.. అదీ జీవించేందుకే. కానీ వారణాసిలో ఉన్న ముక్తి భవన్ లో మరణించేందుకు సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే గది దొరుకుతుంది. అవసాన దశలో ఉన్నవారికి మాత్రమే ఆశ్రయం ఇస్తోందీ భవనం.సాధారణంగా ఎక్కడైనా ఏ హాస్టల్ లోనైనా / హోటలోలైనా గది తీసుకుంటే ఎన్నాళ్లుంటారు అని అడుగుతారు.కానీ ఇక్కడ పద్ధతి కాస్త విచిత్రం. ముక్తిభవన్లో గది తీసుకున్న తరువాత రెండు వారాల్లోగా ఆ వ్యక్తి మరణించాలి.
అలా కాకపోతే ఆ గదిని ఖాళీ చేయించి మరొకరికి ఇచ్చేస్తారు.అలా అని ఆత్మహత్యలు, కారుణ్య మరణాలు (మెర్సీకిల్లింగ్) వంటివి ఉండవిక్కడ. జీవిత చరమాంకానికి చేరుకుని, ప్రశాంతంగా తనువు చాలించాలనుకునే వారే ఇక్కడ గది తీసుకుంటారు.ఆరోగ్యంగా ఉన్న వృద్ధులకు గదిని ఇవ్వరు. మొత్తం ఇక్కడ పన్నెండు గదులుంటాయి. ఓ చిన్న గుడి, పూజారీ ఉంటారు.బంధువులు, సన్నిహితులు లేనివారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ముక్తిభవన్ హాస్టల్ మేనేజర్ భైరవ్నాథ్ శుక్లా అక్కడ మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తుంటారు.
ఆయన 44 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు. వారి కుటుంబం సైతం ముక్తిభవన్ కాంపౌండ్లో ఉన్న ఇంట్లోనే నివాసం ఉంటోంది.ఏటా వేలమంది ఇక్కడికి వస్తుంటారు. చలికాలం కన్నా వేసవిలో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య తక్కువ. ఇక్కడ మరణించిన వారి అంత్యక్రియలకు సంబంధించిన సంస్కారాలను నిర్వహించే వారు అందుబాటులో ఉంటారు.ఒక్కమాటలో చెప్పాలంటే.. ముక్తిభవన్లో కనిపించే దృశ్యాలు మనిషి అంతిమదశలోని జీవన చిత్రాన్ని కళ్లకు కడతాయి. జీవితంలోని చివరిమజిలీని ఆమోదించితీరాల్సిన అనివార్యతని చాటుతాయి.